
చిన్నారుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మనందరి బాధ్యత : జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు.
చిన్నారుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మనందరి బాధ్యత : జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు.
కర్నూలు, (పల్లెవెలుగు) ఆగస్ట్ 29:- భవిష్యత్ తరాల పిల్లల ఆరోగ్యం కోసం రెండు రోజుల పాటు నిర్వహించే జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం కార్యక్రమంలో అందరూ భాగ్యస్వాములై విజయవంతం చేయాలని, చిన్నారుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా నులి పురుగుల నివారణ దినోత్సవ జిల్లా కోఆర్డినేషన్ సమావేశం జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు గారు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 8,9 వ తేదీలలో పెద్దఎత్తున నిర్వహిస్తున్నామని, అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, ఐటిఐ, పాలిటెక్నిక్, అంగన్వాడీ కేంద్రాల్లో 1-19 సంవత్సరాల వయసు లోపు ఉన్న పిల్లలందరికీ నులి పురుగుల నివారణ నిర్మూలన ఆల్బెండజోల్ 400 మి. గ్రా మాత్రలను మధ్యాహ్న భోజన అనంతరం ఉపాధ్యాయుల సమక్షంలో పిల్లల చేత చప్పరించి మింగించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలలో ఉన్న 1-2 సంవత్సరాల వయస్సు పిల్లలందరికీ అర్ధ మాత్రను 3-5 సంవత్సరాల వయస్సు పిల్లలందరికీ ఒక మాత్రను ఇచ్చేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యా సంస్థలు, సర్వ శిక్ష అభియాన్ పిఓ, ఐసిడిఎస్, డిఆర్డీఏ, అన్ని సంక్షేమ శాఖలు భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో, ప్రభుత్వ మరియు ప్రైవేట్ జూనియర్ కళాశాలలో మరియు ఐటిఐ, పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించి ఎంతమంది విద్యార్థులు ఉన్నారో సంబంధించిన నివేదికను గురువారం నాటికి సిద్ధం చేయాలని, సెప్టెంబర్ 5 నాటికి ఆల్బెండజోల్ 400 మి. గ్రా మాత్రలు కూడ చేరే విధంగా చర్యలు తీసుకోవాలని డిఎమ్ హెచ్ఓ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా అధికారులందరూ కూడ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి ఈ మాత్రలను సేవించడం వల్ల రక్తహీనతను నిర్మూలించబడడం, పోషకాహార ఉపయోగితను, వ్యాధినిరోధ శక్తిని మెరుగు పరచడంతో పాటు చదువు పై ఏకాగ్రత, నేర్చుకోగల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని ఇంకా ఏవైనా ప్రయోజనాలు ఉంటే పిల్లలకు తెలియచేయాలని జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆరోగ్యవంతమైన నవ – యువ సమాజం కోసం నేటి చిన్నారుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మన అందరి బాధ్యతని గుర్తు చేశారు. అలాగే జిల్లాలో 35 వేల కో వ్యాక్సిన్ ప్రీకషనరీ డోస్, 30 వేల కోవిషీల్డ్ ప్రీకషనరీ డోస్ వ్యాక్సినేషన్లను ప్రైమరీ హెల్త్ సెంటర్ కేంద్రాలకు, యు పి హెచ్ సి కేంద్రాలకు మరియు సచివాలయాలకు కూడ సరఫరా చేశారని, 18 నుండి 60 సంవత్సరాల వయస్సు ఉండి అర్హులైన ప్రజలందరు వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ వేయించుకునేల చర్యలు తీసుకోవాలని రెండు రోజుల్లోపు ఈ ప్రక్రియ పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇమ్మ్యు నైజేషన్ అధికారి శశిభూషణ్ రెడ్డి గారిని ఆదేశించారు. అలాగే ఎంపీడీవో లు సంబంధిత సచివాలయం వారితో మాట్లాడి అర్హులైన ప్రజలందరూ వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ వేయించుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అనంతరం జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి, రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమ జిల్లా ఇంఛార్జి కో ఆర్డినేటర్ డా. రంగస్వామి రెడ్డి, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.